విష జ్వరాలతో ఒక్క గిరిజనుడు మరణించకూడదు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

 


 


 


విశాఖపట్నం వారధి న్యూస్ , జూన్ 3: రానున్న రోజులలో విషజ్వరాల బారినపడి ఒక్క మరణం కూడా సంభవించ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటిడిఏ సమావేశ మందిరంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్ లతో కలిసి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారులు, వైద్య, పంచాయితీ తదితర శాఖల అధికారులతో ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య సేవలు, ఆసుపత్రులలో మౌలిక వసతులు వైద్యాధికారులు, ఇతర సిబ్బంది, ఖాళీలు, మందుల లభ్యతల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎన్ని విమర్శలు వచ్చినా పాడేరులో కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారని చెప్పారు. ప్రస్తుతం వాతావరణ సీజన్ లో వర్షాకాలం రాబోతోందని, కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముందస్తు సమయాన్ని వినియోగించుకుంటూ ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజనులకు ఆరోగ్య భరోసా ఇచ్చేందుకే మంత్రులు ఉన్నతాధికారులు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం సేవలందిస్తున్న ఆసుపత్రులు వైద్య సిబ్బంది టెస్టింగ్ ల్యాబ్లు మందులు తదితర వివరాలను గురించి అధికారులతో చర్చించారు. ప్రభుత్వం రూ.16 వేల కోట్ల తో ఆసుపత్రులన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పీహెచ్సీలకు టెండర్లు పిలవాలని రూ.2 కోట్లకు జాయింట్ కలెక్టర్లు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కమ్యూనిటీ ఆసుపత్రిల స్థాయి పెంపు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 8వ తేదీ నాటికి 108, 104 వాహనాలు మొత్తం 1,005 ప్రతి మండలానికి పంపించడం జరుగుతుందన్నారు. వాహనాల కేటాయింపులో గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతాలలో రహదారుల ప్రాముఖ్యత పై ఆర్ అండ్ బి పంచాయతీ రాజ్ శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు తెలిపారు. దీనికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో పరిశుభ్రమైన త్రాగునీరు అందించడానికి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సెక్రటేరియట్ పరిధిలో విలేజ్ క్లినిక్ లు పనిచేస్తాయని, శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో గిరిజనుల కోసం సహాయ కేంద్రాలుగా ఎస్. టి. సెల్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని అన్ని పీహెచ్సీలు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అధికారులు అవసరమైన సలహాలను ఇవ్వాలన్నారు. జిల్లాలో సి.ఎస్.ఆర్. నిధులను సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్య సేవలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. పాడేరు లో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ 35 ఎకరాల స్థలంలో రూ.400 కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వలన గిరిజనులు అందరికీ మంచి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, వైద్యవిద్య కూడా గిరిజనుల దగ్గరకు వస్తుందని చెప్పారు. పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీజన్ కు ముందుగానే వైద్య సేవలపై సమీక్ష నిర్వహించడం మంచి ఫలితాలనిస్తుంది అన్నారు. కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పాడేరులో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ను పునరుద్ధరించాలని కోరారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ జి.మాధవి, అరకు శాసనసభ్యుడు శెట్టి పాల్గుణ, పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు నేషనల్ హెల్త్ మిషన్ కమిషనర్ కే. భాస్కర్, జీవీఎంసీ కమిషనర్ జి సృజన పాడేరు ఐ.టి.డి.ఎ పి ఓ ఎస్. వెంకటేశ్వర్ మూడు జిల్లాల జాయింట్ కలెక్టర్లు సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పీవో లు వైద్యశాఖ పంచాయితీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.