ప్రజాభిప్రాయమే మున్సిపల్ శాఖ పనితీరుకు కొలమానం; మున్సిపల్ పట్టణాభివృద్ధిశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం, మే 01 :- ఆంధ్రప్రదేశ్ లో పట్టణ/నగరాలలో నివశిస్తున్న ప్రజల మద్దతే మున్సిపల్ శాఖలోని అధికారులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర మున్సిపల్ప ట్టణాభివృద్ధిశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన ఎం.ఏ అండ్ యు.డి శాఖ కార్యదర్శి శ్యామలరావు సిడిఎంఏ విజయకుమార్తో కలసి రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు మరియు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని, మున్సిపల్ ముఖ్య విధులైన పారిశుద్ధ్యం, రసాయనాలు చల్లించడం వంటి కార్యక్రమాలు తు.చ.తప్పకుండా చేయాలని, ప్రజలు వద్ద నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండాలని ఆదేశించారు. ఏదైనా మున్సిపాలిటీకి గాని, కార్పోరేషన్ గాని కోవిడ్ పనులు నిర్వహించడానికి నిధులు లేమి ఉంటే, తనకుగాని, మున్సిపల్ శాఖ కార్యదర్శి దృష్టిలోగాని, మున్సిపల్ శాఖ కమిషనర్ దృష్టిలోగాని పెట్టాలని సూచించారు. వేసవి కాలం నడుస్తున్నందున నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఇంజనీరింగు అధికారులను కోరారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుకుండా తగు జాగ్రత్తలు తీసుకోనడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, పెద్ద కాలువల్లో పూడిక తీయడం మే నెలాఖరులోగా పూర్తి చేయాలని కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం మున్సిపల్ పాఠశాలల్లో నిర్దేశిత కాలానికి పనులు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ పరిపాలన మరియు అభివృద్ధిశాఖా కార్యదర్శి జె.శ్యామలరావు పారిశు ద్ర్య విభాగంలో నియమించిన వార్డు కార్యదర్శులును పూర్తిగా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నం చేయాలని వారి ద్వారా పారిశుద్ధ్య పనులు విరివిగా చేపట్టి ప్రజలు నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. కోవిడ్ క్వారంటైన్ కేంద్రాల్లో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి పనులు అప్పగించరాదని, ప్రత్యేకంగా తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకొని క్వారంటైన్ కేంద్రాల్లో పనులు అప్పగించాలన్నారు. నిషేధిత ప్రాంతాల్లో పాసులు మంజూరు చేయడం వంటి విధులు, నిబంధనలు అనుగుణంగా చేపట్టాలని, ఏమైనా సమస్యలుంటే తనదృష్టికి గాని, సి.డి.ఎం.ఏ దృష్టికి గాని తేవాలన్నారు. కరోనా వ్యాధి వలన మరణించిన వారి అంత్యక్రయలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలన్నారు.